Sunday, September 18, 2016

ఆపాతాళ నభః స్థలాంత  (రుద్రాభిషేకంలోని ధ్యానశ్లోక ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు) 19-09-2016

          శివా ! నువ్వు ఇటువంటి వాడివి. నీకు నమస్కారము” అని చెప్పేది నమకము.”ఓ శివా ! ఇది కూడా (చ) నాకు ఇవ్వు. (మే)  అని  ప్రార్థనా పూర్వకంగా చెప్పేది చమకము.” నమకము, చమకము కలిపితే అది శతరుద్రీయము.

          సహస్రము అంటే వేయి అని  కాదు. అనంతము అంటే లెక్కపెట్టలేనన్ని అని అర్థం చెప్పుకోవాలి.  అలాగే శతరుద్రీయములోని శతకు వంద - అని అర్థం కాదు. అనేక అని చెప్పుకోవాలి.  అనేకమంది శివులు కనబడేది శతరుద్రీయము. ఈ నమకచమకాల ప్రార్థనా శ్లోకము ఇది.

ఆపాతాళ నభః స్థలాంత  భువన  బ్రహ్మాండ మావిర్భవ
జ్జ్యోతిః స్ఫాటికలింగమౌళి విలసత్‌ పూర్ణేందువాంతామృతైః,
అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకం జపన్
ధ్యాయేదీప్సిత సిద్థయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివమ్‌.

ప్రతి పదార్థము
ఆపాతాళ=పాతాళము  మొదలుకొని,
నభః స్ధలాంత = ఆకాశతలము తుదిగాఉన్న,
భువన = భువనములతో గూడిన,
 బ్రహ్మాండం = బ్రహ్మాండరూపముగా
ఆవిర్భవత్‌ = ఆవిర్భవించు    ,
జ్యోతిః స్ఫాటికలింగ = జ్యోతిర్మయమగు స్ఫటికలింగము యొక్క
మౌళి = తలపై,
విలసత్‌ = వెలుగు,
పూర్ణేందు = నిండు చంద్రుని నుండి,
వాంత = (టు వమ ఉద్గిరణే) కురియు,
అమృతైః= అమృతములచే,
 అస్తోకాప్లుతం = దట్టముగా ముంచబడి నట్టియు,
 ఏకం = కేవలుడగు,
ఈశం = ఈశ్వరుని,
ఈప్సితసిద్ధయే = కోరిక నెరవేరుటకు,
అనిశం = ఎల్లపుడును
రుద్రానువాకాన్‌ = రుద్రానువాకములను,
జపన్‌ = జపించుచు,
థ్యాయేత్‌ = థ్యానించునది,
ధ్రువపదం = మూడుకాలములందును చెడని,
శివం = శివుని,
 విప్రః = విప్రుడు,
అభిషించేత్‌ = అభిషేకించునది.

తాత్పర్యము

          పాతాళం నుండి ఆకాశం వరకూ సమస్తం ఒకటే  లింగం.  ఆ లింగ రూపం బ్రహ్మాండం (బ్రహ్మ + అండం= అనగా ఒక కోడి గుడ్డు లా)
           ఆ వెలుగులతో కూడిన జ్యోతిర్మయమయిన లింగం శుధ్ధమయిన స్ఫటికంలా ఉంటుంది.
           మౌళి అంటే తల. కనుక ఆ తలలో  చంద్రమండలం ఉంది.  చంద్రునిలోని ఆ అమృతం శివలింగం తల నుంచి క్రిందకి అభిషేకంలా పడుతోంది..  అందువల్ల బ్రహ్మాండంలో ఉన్నలోకాలన్నింటీకి  కూడా ఈ అమృత ధార వలన చల్లదనం కలుగుతోంది. ! శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు, మూడు కాలాల్లోనూ నమకచమకాలు చదివేముందు  ఈ శ్లోకం చదువుతూ ఈ సృష్టి మొత్తంగా  వ్యాపించిన  ఆ మహాశివ లింగానికి అభిషేకం చేస్తున్నామని  భావించాలి.

విశేషాలు

  1. ఈశ్లోకమున "అస్తోకాప్లుత మేకమ్‌'కు బదులు "అస్తోకాప్లుత లోకమ్‌' అనియు "ధ్రువపదమ్‌'కు బదులు "అద్రుతపదమ్‌' అనియు ఆవిర్భవత్ అనుటకు ఆవిస్ఫురత్ అనియూ ఇతర పాఠాలు ఉన్నాయి.


  1. ఆపాతాళ నభః స్థలాంత  భువన  బ్రహ్మాండమ్ 'అను మొత్తాన్ని ఒక పదంగా( సమస్త పదము) భావించి  కొంతమంది అర్థం చెప్పారు. పాతాళము మొదలు ఆకాశము వరకు బ్రహ్మాండాన్ని ప్రతిబింబిస్తూ స్ఫాటిక లింగమున్నదని  వివరించారు. " ఇక్కడ అర్థములో  వీరు "అస్తోకాప్లుత లోకమ్‌' అని చదివి దానిని "ఈశ' పదానికి  విశేషణముగా చెబుతారు.

  1. ఇంకొందరు-"బ్రహ్మాండ మభితః' (=అంతటా బ్రహ్మాండము వ్యాపించి ఉన్నదిఅని  అధ్యాహరించి(= ఊహించి) బ్రహ్మాండమును ద్వితీయావిభక్తిగా చెబుతూ  బ్రహ్మాండ మంతటను ఆవిః స్ఫురజ్జ్యోతిఃప్రకాశించు (ఆవిస్ఫురత్)  శివస్వరూప మని చెబుతారు..


  1. అర్థముల్లో కొంచెము తేడా ఉన్నప్పటికీ   తాత్పర్యమొకటే.

  1. నడిచే దేవుడు కంచి స్వామి  శ్లోకానికి  ఇలా వ్యాఖ్యానం చేసారు.

పాతాళలోకంనుండి ఆకాశపర్యంతము వ్యాపించి ప్రకాశిస్తున్న స్ఫటికలింగాన్ని అభిషేకిస్తున్నాను - అని దీనిభావం. స్ఫటికలింగం నిర్లిప్తమైనది. శుద్ధమైనది. నైసర్గికంగాగాని ఔపాథికంగాకాని అది పరిణామం చెందుతుంటుంది. అది గుణదోషరహితమైనది. జ్ఞానమెట్లు నిరంజనమో, పరిశుద్ధమో స్ఫటికమూ అట్లే పరిశుద్ధమైనది. పచ్చని ఆకును దానిమీద ఉంచితే అది పచ్చగానూ, ఎఱ్ఱ పూవుతో అలంకరిస్తే ఎర్రగాను కనపడుతుంది. స్వతహాగా అది నిర్వికారమైనది. నిర్వికార పరబ్రహ్మము, మన మనోభావాలను అనుసరించి మారుతుంది. అనుటకు స్ఫటికలింగ మొక దృష్టాంతం. అది నిర్గుణ పరమాత్మకు చిహ్నం.

స్ఫటికలింగానికి శిరోభాగంలో ఒక చంద్రకళ, సహస్రార కమలములోని చంద్రకళను జ్యోతిస్వరూపాన్ని ధ్యానించేవారికి చంద్రకళనుండి అమృతం స్రవించి ఆనందమిస్తున్నది. ఈసమస్త ప్రపంచమున్నూ ఆనందజ్యోతి స్వరూపమైన ఒక లింగమే. దానిని చల్లచేసినామంటే లోకమున్నూ చల్లనౌతుంది. రుద్రాభిషేకానికిముందు శ్లోకం చెప్పి మరీ ధ్యానించాలి.

బ్రహ్మాండమే ఒక శివలింగమనీ, అభిషేక కాలంలో అట్లు ధ్యానిస్తూ అభిషేకం చేయాలనీ, శ్రీరుద్రం నిర్థేశిస్తున్నది. మంచీ, చెడ్డా అన్నీ భగవత్స్వరూపంగా భావించవలెననే రుద్రం చెప్పుతున్నది. అతి మధురమును, శీతలమునూ అయిన చంద్రమండలాన్ని, నిదానంగా ఉచ్చారణచేస్తూ రుద్రాధ్యయనం చేస్తూ లింగాన్ని అభిషేకించాలి.

లింగానికి ఆద్యంతాలులేవు. మనం ఏరీతిగా స్ఫటికాన్ని చూస్తున్నామో, రీతిగానే అది మనకు కనబడుతుంది. భగవంతుడున్నూ మనం విధంగా ప్రార్ధిస్తున్నామో విధంగానే మనలను అనుగ్రహిస్తున్నాడు. మన మనస్సునకు ఒక ఆకృతి అవలంబంలేక ప్రతీకం ఉంటేనేకాని ఆనందం కలగటంలేదు. మనం ప్రేమించే బంధువర్గం విషయంలోకూడా క్షేమవార్త వినటం ఒకరకం, సమక్షంలో దర్శించటం మరొక రకం. ప్రత్యక్షమైతేనే ఆనందం కలుగుతున్నది. భగవద్విషయంలోకూడా ఒక మూర్తి ద్వారా లభించే అనుగ్రహమే సంతోషదాయకంగా ఉంటున్నది.

ఆద్యందరహితంగా పరమేశ్వరమూర్తి జ్యోతి స్వరూపంలో అరుణాచల క్షేత్రంలో ఆవిర్భవించాడు.

అపాతాళ నభస్ధలాంత భువన బ్రహ్మాండంగా వ్యాపించియున్న జ్యోతి స్వరూపాన్ని చంద్రమౌళీశ్వరుని స్ఫాటికలింగ రూపంగా మనం ధ్యానిస్తే వారి అనుగ్రహంకల్గి మనకు ఆనందం కల్గుతుంది.\

  1. కే శివానంద మూర్తిగారు  శ్లోకానికి ఇలా వివరణ చేసారు.
 తూర్పు దిశ నుండి అష్ట వసువులు గాయత్రీ చందస్సులో మహాదేవుని పొగుడుతూ  అమృతముతో అభిషేకిస్తున్నారు.
 దక్షిణ దిశనుండి ఏకాదశ రుద్రులు త్రిష్టుప్ చందస్సులో రుద్రుని పొగుడుతూ  అభిషేకిస్తున్నారు. ద్వాదశాదిత్యులు పడమర దిశనుండి జగతీ చందస్సులోనూ, విశ్వేదేవతలు ఉత్తర దిశనుండి అనుష్టుప్ చందస్సులోనూ శివునికి అభిషేక క్రియ చేస్తున్నారు.. బృహస్పతి పఙ్క్తీ చందస్సులోని మంత్రములతో  బ్రహ్మాండములో ఊర్ధ్వ దిశనుంచి దశ దిశలనుంచి  అభిషేక క్రియ నిర్వహిస్తున్నాడు. (“Structure of the Universe – Vedic” by K Sivananda Murty, 2013)

  1. భాషా విశేషాలు
ఆపాతాళ
ఆపాతాళ శబ్దాన్ని మురారి కవి చక్కగా ప్రయోగించాడు. ప్రయోగమిది.
దేవీం వాచ ముపాసతే హి బహవ: సారంతు సారస్వతమ్
జానీతే నితరామసౌ గురుకుల క్లిష్టో మురారి: కవి:
అబ్దిర్లంఘిత ఏవ వానర భటై: కింత్వస్య గంభీరతాం
ఆపాతాళ నిమగ్న పీవర తనుర్జానాతి మంద్రాచల:
సరస్వతిని ఎంతోమంది పూజించవచ్చు.కాని సారస్వతము  గురుకులములోశ్రమపడి చదువుకొన్న  ఒక "మురారి" కే తెలుస్తుంది.
సముద్రమును ఎన్నో కోతులు  దాటాయి. కాని సముద్రపులోతు - పాతాళం వరకు మునిగిన మందరపర్వతానికి మాత్రమే  తెలుస్తుంది.

                                ఈ   ఆపాతాళ   శ్లోకం  లోతు కూడా ధ్యానపరులకు మాత్రమే  విస్పష్టంగా తెలుస్తుంది.
                                                                                స్వస్తి.
               



Friday, September 9, 2016


Dr. Tadepalli patanjali  pravachanamas on  Srinatha 

Shivaratri maahatmyam (64 videos)

 Link 




Dr. Tadepalli patanjali  pravachanamas on  Srinatha Haravilasam(124 videos)

 Link 

Haravilasam

Sunday, September 4, 2016



గురు వినాయక చతుర్థి శుభాకాంక్షలు  05-09-2016

padyamulu on alampuram jogulambadevi


                                      శ్రీ జోగులాంబాదేవి
ఏతల్లి చూపులో ఈరేడు లోకాలు
కుసుమించి  పసమించి  ఎసకమెసగు
ఏతల్లి  నవ్వులో ఈరేడు లోకాలు
కథ మించి కళపెంచి కదల నేర్చు
ఏ తల్లి చేష్టలో ఈరేడు లోకాలు
మదిపెంచి ముదమెంచి హృదయమిచ్చు
ఏ తల్లి అడుగులో ఈరేడు లోకాలు
హితమెంచి గతమెంచి మతిని పెంఛు
అట్టి నాతల్లి సుగుణాల హర్ష వల్లి
జోగులాంబామతల్లి నా యోగ భిల్లి
పుష్కరస్నాన పుణ్య సంపూర్ణవేళ
మమ్ము సతతమ్ము రక్షించి మనుచుగాత!
బ్రహ్మ  దేవాలయ బ్రహ్మాండ నిలయము
          అత్యద్భుతమయిన అలముపురము
ఆసీనురాలగు  అమ్మతో భయదము
          అత్యద్భుతమయిన అలముపురము
బల్లి తేలు జతుకలల్లిన జుత్తుతో
          అత్యద్భుతమయిన అలముపురము
శిధిలమయిన గుడి చెక్కిన శర్మము
          అత్యద్భుతమయిన అలముపురము
ఉత్తరవాహిని చిత్తపు కాశము
అత్యద్భుతమయిన అలముపురము
గొందిమల్లెచేరువయైన సందె కడెము
అద్భుత వికాస భాసము అలముపురము
శక్తి పీఠమై  పుష్కర శక్తినిచ్చు
అద్భుత వికాస భాసము అలముపురము

పుష్కరాల వేళ తలచి పొంగిపోదు

AIR HYD Bhavana july 2016 04 scripts

 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సౌజన్యం భావన 22-07-2016
మనసును పెంచినదే మట్టి?


ప్రశ్న మానవుని ఊపిరి. జ్ఞానానికి వాహిక . ప్రశ్నల కత్తుల వంతెనల మీద నడిచివెళ్ళి సమాధానాలను అన్వేషించినవారు, అన్వేషిస్తున్న వారు అనేకమంది ఉన్నారు.108 ఉపనిషత్తులలో ఒక ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు.


ఈ ప్రశ్నల పరంపరలో పంచభూతాలను ప్రశ్నిస్తూ ఒక తాత్విక గీతం ఆధునిక కాలంలో చాలా ప్రాచుర్యం పొందింది.


మనిషిగ పుట్టెను ఒక మట్టి/తన మనసును పెంచినదే మట్టి/మానై పుట్టెను ఒక మట్టి/తన పూవై పూసినదే మట్టి


పంచభూతాలలో మొదటిది భూమిలేదా మట్టి. భూమిలోనుంచి పుట్టామని అందరము చెబుతుంటాం.అందుకే మనిషిగ పుట్టెను ఒక మట్టి అని అంటూ కనబడని తన తన మనసును పెంచినది ఏ మట్టి ? అని కవి ప్రశ్నిస్తున్నాడు. చెట్టుగా ఇదే మట్టి పుట్టింది. మరి చెట్టులా కాకుండా మట్టి పువ్వులా ఎలా మారింది? అని ప్రశ్న.


మనిషి-మనసులకు ఉపమానాలు మాను, పువ్వులని కవి చెప్పారు. మట్టిలోనుంచి మనిషి. ఆ మనిషి జన్మ ముగిసిన తరువాత మట్టి. చెట్టు నుండి పువ్వు వస్తుంది. పువ్వు నుండి చెట్టు వస్తుంది.ఈ పరిణామ క్రమాన్ని గుర్తించినంత కాలం అజ్ఞానం.మోహం.


ఆయువు పోసెను ఒక గాలి/జీవాత్మలనూదినదే గాలి?/వేణువులూదెను ఒక గాలి/పరమాత్మునికూపిరి ఏ గాలి?


పంచ భూతాలలోని గాలిని గురించి ప్రశ్నల పరంపరఇది.
జీవుడికి ఆయువుని పోసేది గాలి. శరీరాలను మారుస్తూ పోయే జీవాత్మలను ఏ గాలి కల్పించింది? ప్రతి జన్మలోనూ ఈ జీవాత్మల జీవనవేణువులుఊది రాగాలను అనుభవాలను ఏ గాలి ఊదుతోంది? ఆ గాలిని పరమేశ్వరుడంటే ఆ ఈశ్వరునికి ఊపిరి అయిన గాలి ఏమిటి? ఇక్కడ గాలి అంటే ప్రాణం.


“నేను ఇదివరకు ఏ కాలంలోనూ లేనట్టు కాదు ; నువ్వు కూడా ఇదివరకు ఎన్నడూ లేనివాడివి కావు. అదేవిధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకు ముందు ఏ కాలంలోనూ లేనివారు కారు. అంతేకాదు ; మనందరమూ భవిష్యత్తులో మళ్ళీ ఉండమనీ అనుకోవద్దు” అని భగవద్గీత.ఇది బాగా అర్థం చేసుకోమని – పామువేరు- తాడు వేరు- జీవుడు వేరూ- దేవుడూ వేరూ అనుకోవద్దని మనము శాశ్వతులమని వ్యంగ్యంగా కవి ఉపదేశం.


ఆకలి పెంచినదొక నిప్పు/తన అంగము పెంచినదే నిప్పు/కన్నుగ వెలిగెను ఒక నిప్పు/తన వెన్నుని గాంచినదే నిప్పు


మండటం, వెలగటం నిప్పు లక్షణాలు. శరీరంలొ నిప్పు వైశ్వానర రూపంలో మండుతుంది. కంటి లో వెలుగుగా మారి చూపును ఇస్తుంది.
ఆకలిగా మండించి అవయవాలకు శక్తిని అందించినది ఏ నిప్పు?వెన్ను పూస చివర కుండలినీ శక్తిగా మారినది ఏ నిప్పు? అని కవి ప్రశ్న.
ఇదంతా పరబ్రహ్మమని, అయనను సదా కొలువమని జవాబు.


దాహము తీర్చెను ఒక నీరు/తన దేహపుటొరవడి ఏ నీరు/కడలై పొంగిన దొక నీరు/తన కన్నుల పొంగినదే నీరు


దాహాన్ని ఒక నీరు తీరుస్తోంది. దేహాన్ని నడుపుతున్న నీరు ఏమిటి? కడలిగా – సముద్రంగా ఒక నీరు మారి పొంగుతోంది.కన్నులలో పొంగేది ఏనీరు?


అటనట నిలిచెను ఒక గగనం/
తన ఘటమున నిండినదేగగనం/
ఘటనాఘటనల నడుమ నటనలో/
మెరుపులు మెరిసినదే గగనం


. కుండ ఉన్నంత కాలం కుండ లోపల ఉన్న ఆకాశం ఘటాకాశం బయట ఉన్న మహాకాశం వేరు వేరుగా అనిపిస్తాయి. కుండ ముక్కలైపోతే అంతా మహాకాశమే. ఆ అజ్ఞానం ఛిన్నమైపోతే జీవుడూ, ప్రపంచం, బ్రహ్మమూ అంతా ఒకటే అని గోచరిస్తుంది. ఈ మెరుపులు మెరవాలని కవి కాంక్ష.


పంచభూతముల పంజరశుకమై/
అలమట జెందిన నేనెవరో/
ఏడు కొండలా ఎత్తున నిలిచి/
బదులే పలుకని నీవెవరో!/
ఇంతకు నాకు నీవెవరో!


“పంచభూతాలతో చేసిన పంజరం అంటే శరీరం లో చిక్కుకున్న చిలుకను నేను, శరీరం నుండి శరీరానికి మారుతూ దుఃఖపడుతున్నాను, నాకు శాంతి కావాలి! కాని ఏడు కొండలపైన ఉన్న వేంకటేశ్వరుడు (ఈశ్వరుడు)మాటలాడటంలేదు. ఆయనెవరు? నేను ఎవరు?


ఆయన నేను ఒకటే అని జవాబు. అంతర్యామిని అంతరంగంలో దర్శించాలి. బయట కాదు అని ఉపదేశం.


ఇందుకే దేవాలయాల్లో దేవుని ముందు నిలబడి కళ్ళు మూసుకోమంటారు. ఎందుకంటే ఎదురుగా బయటగా కనబడే దేవుడిని లోపల దర్శించటం నేర్చుకొమ్మని.


మనస్సుకు హత్తుకు పోయే ఈ తాత్విక గీతాన్ని , చలన చిత్రాల కోసం కాకుండా, స్థిర జ్ఞానాన్వేషణలో వేటూరి సుందరరామమూర్తి అనే మహాకవి అంతరాత్మతో వ్రాసుకొన్నారు. స్వస్తి.
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సౌజన్యం. భావన (15-07-2016)
మనసా ఎటులోర్తునే
మనస్సు  అనేది తెలిసీ తెలియని బ్రహ్మ పదార్థం.  మనస్సు మనకు ఉన్నదనే అందరం చెబుతుంటాం. మనస్సు లేదనే వారు దాదాపుగా తక్కువ.
 త్యాగరాజ స్వామి వారు మనస్సు గురించి  చాలా కృతులు వ్రాసారు.
.మనసా ఎటులోర్తునే నా/
మనవిని చేకొనవే  అని పల్లవి.
ఓ మనసా! నేను నీకు ఎన్ని విన్నపాలు చేసాను!? నామనవిని గ్రహించవేమిటే? ఆదరించవే!
ఆ మనవి ఏమిటో త్యాగరాజస్వామి చరణాలలో వివరిస్తున్నారు

దినకరకుల భూషణుని/
దీనుడవై భజనజేసి/
దినముగడుపమనిన నీవు/
వినవదేల గుణవిహీన
దినకరుడు అంటే సూర్యుడు. ఆ సూర్యకులమునకు అలంకారమువంటి వాడు రాముడు. వంశములో చాలా మంది జన్మిస్తారు. అలంకారము వల్ల శరీరానికి కాంతి వచ్చినట్లు,  వారిలో కొద్ది మందివల్లనే ఆ వంశానికి పేరు వస్తుంది.  శ్రీ రాముడు అటువంటివాడు. ఓ మనస్సా ! ఆ రాముని   దీనత్వంతో భజన చేసి ప్రతి రోజూ గడపమని మనవి చేసినా  వినవు . మంచిలక్షణాలు లేనిదానివే నువ్వు. గుణ విహీనురాలివి  అందుకే నా మనవిని వినటం లేదు.
దేవుడిని ఎలా కొలవాలో త్యాగరాజస్వామి ఈ చరణంలో చెప్పారు.
స్వామి దగ్గర   దర్పం  పనికిరాదు.దీనత్వం ఉండాలి.అధికుడిని, ఐశ్వర్యవంతుడిని-  ఇలా జిడ్డులన్నీ  వదిలించుకొని, ఏమీ లేని తనంతో శ్రీరాముని మనస్సులోకి ఆహ్వానించాలని ప్రబోధము .

కలిలో రాజస తామస గుణములు - గలవారి చెలిమి/
కలిసిమెలసి తిఱుగుచు మఱి - కాలము గడపకనే
సులభముగా గడతేరను - సూచనలను దెలియజేయు/
ఇలను త్యాగరాజుమాట - వినవదేల గుణవిహీన
ఈ కలియుగములో  రజోగుణము వల్ల పుట్టిన  గర్వముతో – రాజస గుణముతో ఉండే వాళ్లు కొంతమంది.
తమోగుణము వల్ల పుట్టిన చిరాకు, కోపము – ఇలాంటి  తామస గుణము తో  ఉండే  వాళ్లు మరికొంతమంది.
ఓ బుద్ధిలేని మనసా ! వీళ్లతో నాకు స్నేహము చేయిస్తావేమిటే?

వాళ్ల మీద నాకు ప్రేమను పెంచుతావు. వాళ్లతో తిప్పుతావు. విలువైన కాలాన్ని వృథాగా గడిపేస్తావు.. ప్రతి జన్మకి  ముందు  9 నెలలు తల్లి కడుపులో మల మూత్రాలలో తేలుతూ గడపటం ఎంత బాధాకరం. అసలు మళ్ళీ జన్మ ఎత్తకుండా- రామ నామాన్ని జన్మిస్తే మోక్షం సులభముగా వస్తుందని చెబుతున్నా- సూచిస్తున్నా- ఈ త్యాగరాజు మాట పట్టించుకోవా  !
ఈ సందేశాన్ని తాగరాజస్వామి తన మనస్సుకు చెప్పుకొంటున్నట్లు ఉంది కాని – ఇది అందరి మనస్సులకు సంబంధించినది.

మన ఏవ మనుష్యాణాం!కారణం బంధమోక్షయోః!బంధాయ విషయాసంగి!ముక్త్యై నిర్వషయం స్మృతమ్!!  అని మైత్ర్యుపనిషత్ .
మనస్సే బంధమోక్షములు రెంటికీ కారణం.
.మనస్సు విషయాసక్త మయితే  బంధం.
,నిర్విషయమయితే ముక్తి. ఈ విషయాన్నే త్యాగరాజ స్వామి ఆవేదన పూర్వకంగా , విషయలంపటాలలో కొట్టుకొనిపోతున్న మనందరికి ఈ కృతిలో మనస్సు పరంగా చెప్పారు
.
శ్రీ రాముని తలువకుందా    ఇతర విషయాలు తలిస్తే అది  ఎలా ఉంటుందంటే - ఇంటి తలుపులు బార్లా తీసి, కుక్కలను లోపలికి తరిమినట్లట  తన తలు పొకరింటికి దీసిపెట్టి/తాగుక్కలదోలురీతి గాదో!

దేవుని మీద  మనస్సు నిలపకుండా పూజ గంటలు మోగిస్తూ పూజ చేయటం వృథా  . గంగానది, కావేరి నది పవిత్రమయినవే. అయినప్పటికీ మనస్సును స్వాధీనం చేసుకొని  భక్తితో మునిగితే ఫలితం ఉంటుంది. అంతే కాని భక్తి లేకుండా చేసే మునకలు వృథా.

  ఇలా మనస్సు మీద రకరకాల కృతులు రచించిన త్యాగరాజ స్వామి సందేశము అంతర్గతంగా ఈ కృతిలో ఒక్కటే. అదే నిగ్రహం.స్వస్తి.


నందబాలం భజరే (ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సౌజన్యం 01-07-2016 భావన)
శ్రీ కృష్ణుడన్నా, ఆయన చిరునవ్వు అన్నా  భక్త కవులకు, భక్తులకి చాలా ఇష్టం. అందుకే ఏదేవున్ని ఉపాసించినా ఓ మాటు శ్రీ కృష్ణున్ని తాను ఉపాసించే  దైవంలో  చూసుకొని భక్త కవులు మురిసిపోతుంటారు. ఆ ఒరవడిలోనే అంతా రామమయం అని భావించిన రామ భక్తుడు రామదాసు శ్రీ కృష్ణుడిని “నందబాలం భజరే “  అని పరవశత్వంతో  రాముడిలో దర్శించాడు.
నందబాలం భజరే బృందావన వాసుదేవ బృందాలోలం
నందుని కుమారుడైన బాల కృష్ణుని నేను సేవిస్తుంటాను.  బృందావనము అంటే ఆసక్తి కలిగిన , వసుదేవుని సుతుని నేను సేవిస్తుంటాను.
 నంద బాలుడంటే  నందుని కుమారుడని బయటకు కనిపించే అర్థం.నందము అంటే సంతోషం. ఆనందం బాల్యంలోనే అధికం .అందుకే ఆనందం బాల్యంలో ఒక రూపం ధరించింది.అతడే నంద బాలుడు . శ్రీ కృష్ణుడు. పోతన గారు కూడా  నందాంగనా ఢింభకుడు అని  చెబుతూ ఆ నంద స్వరూపుని కృష్ణుని తలచుకొని పొంగి పోయారు.
యమునానది పశ్చిమతీరములో మధుర దగ్గర  ఉన్న ఒక  వనం బృందావనం.. దీనికి ఎదుట అంటే  యమునయొక్క తూర్పుగట్టున గోకులం ఉంది.. అక్కడే  కృష్ణుడు గోపకన్యకలతో అనేకలీలలు చేసాడు.

జలజసంభవాది వినుత చరణార విందం
పద్మమునుంచి పుట్టిన  బ్రహ్మ మొదలయిన వారి చేత కొనియాడబడిన పాద పద్మములు కలవాడు అని చరణములోని మొదటి పాదం.
బ్రహ్మకు రకరకాల పేర్లు ఉన్నాయి. కాని జలజ సంభవుడు అని పద్మ సంబంధమైన పదాన్ని ప్రయోగించటంలో కవి నేర్పు ఉంది.ఎందుకంటే పాద పద్మములు సేవించబోతున్నాను అని తర్వాత పదం.
లలిత మోహన రాధావదన నళినమిళిందం
లలితమైన, మోహనమైన రాధాదేవి ముఖానికి తుమ్మెదలాంటి వాడు కృష్ణుడు.
ఈ రాధ ఎవరు? విడువని భక్తిని ధారతో పోలుస్తారు. ఆ ధారా ను తిరగవేసి చదివితే రాధా.
వినటానికి కష్టం గా ఉన్నా -  ఈ లోకంలో నడుస్తున్న సంసారాలు,కాపురాలు అన్నీ 'అవసరం' కోసం  నడుస్తున్నాయి . కాని  రాధ ప్రేమ స్వార్ధాన్ని దాటిన ప్రేమ. తనను మరచి తన ప్రియతముని ధ్యానంలో కరిగి పోవడమే రాధాతత్త్వం. తన వ్యక్తిత్వాన్ని కరిగించి తాను తన ప్రియునిగా మారడమే రాధాతత్త్వం. శ్రీరామకృష్ణ  పరమహంసకు కూడా  కూడా మొదటగా రాధాదేవి దర్శనం అయిన తర్వాతనే కృష్ణదర్శనం కలిగింది

ఒక సారి  నారదుల వారు రాధను చూసి ”అమ్మా !కృష్ణుడు లేదని బాధ పడుతున్నావా ?”అని అడిగాడు .అప్పుడు రాధ ”కృష్ణుడు నా హృదయం లోనే ఉన్నాడు కదా ఆయన లేనిది ఎక్కడ ?ఆయన లేడని బాధ పడితే,నా హృదయం లోని దేవుడికి ఆ బాధ కలిగించి నట్లే కదా “ అన్నదట.  ఉత్తమ భక్తుని చుట్టూ తిరిగే వాడు భగవంతుడు. అందుకే రాధ అనే వదనం చుట్టూ తుమ్మెద అని రామదాసుల వారి వర్ణన
“నిటలతట స్ఫుట కుటిల నీలాలక బృందం
నుదురు మీద ప్రకాశించే వంకరగా అందంగా ఉన్న  నల్లనైన ముంగురులు కలవాడు
ఘటితశోభిత గోపికాధర మకరందం
శోభించిన గోపికల పెదవులలోని మకరందాన్ని ఆస్వాదించువాడు .
గోదావరీతీర వాసగోపికా కామం‪‎
 గోదావరి తీరములో నివాసమేర్పరచుకొన్న గోపికలకు  ఇష్టమైన వాడు
శ్రీకృష్ణ‬ తత్త్వాన్ని జీర్ణించుకున్న మండపాక పార్వతీశ్వరకవి తన 'రాధాకృష్ణ సంవాదము' అనే కావ్యంలో తన ఉపాసనను యిలా ఆవిష్కరించాడు.
''‪‎మురళి‬ ప్రణవంబు గోపికలు ముక్తజశము/గోగణంబు చిరంతన గోగణంబు/రాధ మూల ప్రకృతి లక్ష్మి బ్రహ్మవిద్య/కృష్ణు డానందమయ తత్త్వమిదె నిజంబు''కృష్ణుడు ఆనందమయ రూపం, లక్ష్మి బ్రహ్మవిద్యా జ్ఞానం, రాధ ప్రకృతి స్వరూపం, గోపికా సమూహము ముక్తిజనం, ఒకే సారి కొన్ని వేల మంది  నేల మీద అద్దాలు పట్టుకుని  నిలబడ్డారు. పైన ఉన్న సూర్యుడు  వాళ్ళందరి అద్దాల్లోను కనబడతాడు. సూర్యుడు శ్రీ కృష్ణుడు గోపికలు  అద్దాల్లోని ప్రతి బింబాలు.
ఆదిత్యవంశాబ్ధిసోమం భద్రాద్రి శ్రీరామం
సూర్య వంశము అనే సముద్రానికి చంద్రుడు,  భద్రాచల రాముని రూపంలో ఉన్న శ్రీ కృష్ణుని సేవిస్తాను అని ఈ కీర్తనను రామదాసు ముగించాడు..
సముద్రపు ఒడ్డున ఒక పిల్లవాడు కేరింతలు కొడుతున్నాడు. ఆటలాడుతూ, అలలు పట్టుకోవాలని లోలోపలకి వెళుతున్నాడు. ఒక పండితుడు ‘బాబూ ! ఎందుకలా వెళుతున్నావు’ అని అడిగాడు. అలలతో ఆడుకోవటానికి’ అని కుర్రవాడి  సమాధానం.. ‘ఈత వచ్చా ?’ పండితుని ప్రశ్న,.. రాదని అబ్బాయి చెప్పాడు. ‘ఈత రాకపోతే సముద్రంతో  నువ్వు ఆడుకోవటం కాదు, సముద్రం నీతో ఆడుకుంటుంది. ముందు ఈత నేర్చుకో. ఆ తర్వాత అలలతో ఆడుకో’ అని ఆ పండితుని ఉపదేశం
శృంగారం వేషం వేసుకొన్న రామదాసు కీర్తన అలానే సముద్రంగా కనిపిస్తుంది
పరమార్థంగ్రహించటం   ఈత వంటిది.
అప్పుడు ఆ భక్తి సముద్రంలో ఎన్ని మునకలయినా వేయవచ్చు.స్వస్తి.
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సౌజన్యం                భావన 08-07-2016
గాయతి వనమాలీ
పరబ్రహ్మాన్ని అనుభవిస్తూ సదాశివ బ్రహ్మేంద్రులు పాడుకొన్న కీర్తనలు సుప్రసిద్ధమైనవి. చక్కటి  గాయకుడు ఆలపిస్తున్నప్పుడు  అందులో ఏ కీర్తనకు ఆ కీర్తన ప్రశాంతమైన, అనిర్వచనీయమైన స్థితిలో మనలిని పరవశింపచేస్తాయి. అటువంటి ఒక సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలోని అర్థ మాధుర్యాన్ని దర్శించి పరవశిద్దాం

గాయతి వనమాలీ – మధురం గాయతి వనమాలీ
వనమాల అంటే  నాలుగు అర్థాలున్నాయి. మోకాళ్లవరకు వ్రేళ్లాడుతూ, అన్ని ఋతువులలోనూ పూచే పూలతో, మధ్యన పెద్ద గుచ్ఛంతో  మెడలో ఉండే దండ.శబ్ద స్పర్శరూపరస గంధములకు ఒక  రూపమైన దండ. చివురుటాకులు, పూలు కూర్చిన దండ. శివ కేశవ భేదం లేని దండ. ఇటువంటి  వనమాలను ధరించివాడు వనమాలి. ఆ వనమాలి అయిన  శ్రీకృష్ణదేవుడు   వేణువుతో మధుర గానము చేస్తున్నాడు.

పుష్పనుగన్ధిసు - మలయ సమీరే/మునిజన సేవిత యమునా తీరే
పూలవాసనలతో గుబాళిస్తున్న  చల్లని గాలితో నిండిన – మునిజనులు ఉంటున్న  – యమునానదీ తీరంలో  వనమాలి  అయిన శ్రీకృష్ణదేవుడు గానము చేస్తున్నాడు.
సూర్యుని కూతురు యమున . దీని దగ్గర  ఉండే  గోకుల బృందావనములలో  శ్రీకృష్ణుఁడు అనేక లీలలు చేసాడు.  యమున నీరు నల్లగా ఉంటుంది.
ఆ యమునా నదీతీరంలొ ఎవరి దారి వారిదే అను అర్థంలో ఎవరికి వారే యమునా తీరే అను జాతీయము ప్రసిద్ధిలోకి వచ్చింది. అంతమంది గోపికలున్నా ప్రతి ఒకరూ కృష్ణుడు తమతోటే ఉన్నారనుకొన్నారట. మిగతావాళ్లను పట్టించుకోలేదు.అసలే పూల వాసన. దానితో కలిసిన చల్లని గాలి. చల్లని హృదయాలు కలిగిన మునిజనుల స్పర్శ. ఇవన్నీ కలిగిన యమునా నదీ తీరంలో   మధురమైన కృష్ణ గానము. అద్భుతమైన సన్ని వేశము.

కూజిత శుక - పిక - ముఖ ఖగకుఞ్జే/కుటిలాలిక బహు నీరదపుఞ్జే || గాయతి||
ఆ యమున ఒడ్డున ఉన్న పొదలలో చిలుకలు, కోయిలలు అందంగా కూస్తున్నాయి. ఉంగరాలజుట్టులా  మబ్బులు ముసురుకొని వస్తున్నాయి. వాటి మధ్య  కృష్ణ స్వామిగానము ప్రవహిస్తోంది.
మబ్బులు  ఉంగరాలజుట్టులా  ఉన్నాయి అనుట ఏ కవి ప్రయోగించని అందమైనపోలిక. కృష్ణయ్య ముంగురులను పోలిన మబ్బులవి. ఉంగరాల మబ్బులు కురవకముందే కృష్ణ గాన రస ప్రవాహము ప్రవహిస్తోందనుట – వర్ణించటానికి సాధ్యం కాని కవితోక్తి.

తులసీదామ విబూషణహారీ/జలజ భవస్తుత సద్గుణ శౌరీ || గాయతి||
తులసీమాలికను అలంకరించుకొన్నవాడు - బ్రహ్మ మొదలైన వారి పొగడ్తలను అందుకొనే వాడు,  గుణశాలి - శౌరి - వనమాలి గానముచేస్తున్నాడు.
 శ్రీ కృష్ణభగవానునికి  సరితూగ గలిగిన "పవిత్రత" తులసికి ఉందని అందుకే  "తుల"తూగ గల మొక్కకనుక "తులసి" అన్నారట. తులసి మొక్క క్షీర సాగరమధన సమయంలో  అమృతంతో బాటు పుట్టింది. .కార్తీక మాసం లో, శుక్ల పక్షంలో ద్వాదశి నాడు విష్ణువుకు,తులసికి కల్యాణం చేస్తారు.
 తులసి తీర్ధాన్ని చివరి సమయంలో  జీవునికి ఇవ్వడం తులసి యొక్క గొప్పతనాన్ని  తెలియజేస్తుంది.ఇలా చాల విశేషాలున్న తులసీ ఆకులను
 శ్రీ కృష్ణుడు ధరిస్తాడని చెప్పి, సదా శివ బ్రహ్మేంద్రులు  స్వామి గొప్పతనంతో పాటు   తులసి గొప్పతనాన్ని చెప్పారు.

పరమహంస హృద యోత్సవకారీ/పరిపూరిత మురళీ రవధారీ .
పరమహంసలైన సదాశివబ్రహ్మేంద్రుల) హృదయమును ఆనందంతో నింపుతూ  - వనమాలి గోపాలదేవుడు - గానము చేస్తున్నాడు.

ఆనందం వివిధ స్థాయిలలో కలుగుతుంది. ఎవరి అర్హతను అనుసరించి వారు ఆ స్థాయిలొ ఆనందాన్ని అందుకొంటారు. బ్రహ్మ గుణము లేనివాడు.. సత్ చిత్ ఆనందము ఈ మూడింటిని  బ్రహ్మకు ఉపలక్షకములుగా అంటే బ్రహ్మను సూచించేవిగా చెబుతారు. రసోవైసః అంటే  రసమే గా బ్రహ్మ. రసమును పొంది ఆనందము కలవాడవుతున్నాడంటే  -  వాడు బ్రహ్మ అవుతున్నాడని అర్థం

సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తనలు అలా చదివే వారిని, వినే వారిని  ఆనందంతో బ్రహ్మ సదృశులుగా చేస్తాయి. స్వస్తి.

choornika meanings చూర్ణిక” – అర్థ విశేషాలు

  శ్రీరంగకవి రచించిన   త్రిపురాంబిక “ చూర్ణిక” – అర్థ విశేషాలు
-                    డా. తాడేపల్లి పతంజలి
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

                త్రిపురాంతకంలో  కదంబవన పీఠేశ్వరిగా  వెలసిన బాలా త్రిపుర సుందరిపై ఒక చూర్ణికను  పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన భారతుల పేరయ్య శాస్త్రి రచించారు.. ఈయనకు శ్రీరంగకవి అని ఇంకోపేరు.  కర్నూలు మండలంలోని  అన్నసముద్ర గ్రామవాసి. కాలం పందొమ్మిదవ శతాబ్దం
చూర్ణిక లక్షణాలు.
          లక్షణశిరోమణి మతమున వచనరచన అయిదురకాలు.  గద్య , బిరుదుగద్య  చూర్ణిక, వచనము , విన్నపము వీటిలో చూర్ణికలను   కృష్ణమాచార్యుడు రచియించినట్లుగా చెప్పి  తాళ్లపాక ఆన్నమాచార్యులవారు తమ సంకీర్తన  సంకీర్తనలక్షణములో   చూర్ణిక లక్షణాలు ఈ పద్యంలో చెప్పారు.
ధర  కృష్ణాచార్యాదిక
/పరికల్పితపదము తాళబంథచ్ఛందో
విరహితమై చూర్ణాఖ్యం
 బరగును నిర్యుక్తనామభాసితమగుచున్,
చూర్ణికకు చందో విరహితమైనది. నిర్యుక్తము అని ఇంకొక పేరు దీనికి ఉంది అని అన్నమయ్య వివరణ.

పొత్తపి వేంకటరమణకవి లక్షణశిరోమణిలో చూర్ణిక లేకవచన ద్వివచన బహువచన సందర్భంబులుగ విభక్త్యానుశాసనిక సమాసాదిత కల్పనానల్పజల్పితంబై వెలయును అన్నాడు. ఏకవచన ద్వివచన బహువచన సందర్భాలతో , మనోహరమైన కల్పనలతో , విభక్తులను అనుశాసించుటకు తగినట్లుగ చూర్ణిక ఉంటుదన్నాడు..
ఇక చూర్ణికకు  ప్రముఖ నిఘంటువులు ఇచ్చిన అర్థాలు ఇవి
1. గద్యభేదము;2. గ్రంథభేదము. ( శబ్దరత్నాకరము బహుజనపల్లి సీతారామాచార్యులు 1912   )
A sort of harmonious prose, not divided into prosodial feet, but with the unbroken sentence running on continously. (బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 )
a kind of easy prose (శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953 )
 ‘చూర్ణికఅంటే తేలిక పదాలతో కూర్చిన రచన అనే అర్థం కొంతమంది చెప్పారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారయితే చూర్ణిక పదం బాగా నచ్చి ఒక చక్కటి కథ  కూడా వ్రాసారు. 
            'మానాన్న చూశావ్. బయట పరమ సాధువు. ఇంట ఫాలాక్షుడు... ఎవరి మీదా కోపం కాదు. ఎందుకో ఒకందుకని కాదు. ఎప్పుడు ఒకటే ధుమధుమ... అలా అని పెళ్లాన్ని వేపుక తినేవాడా... అక్కడ పిల్లి... నా మీద మాత్రం ఒంటికాలి మీద లేచేవాడు...' అంటూ తమాషాగా చమత్కారంగా   చూర్ణికలోని ఒక పాత్ర చెబుతుంది.
ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు శ్రీదీపాల పిచ్చయ్య శాస్త్రిగారు తమ చాటు పద్య  రత్నాకరములో ఉదహరించిన బాలా త్రిపురసుందరి ఉపాస్య దేవతగా కల శ్రీరంగ కవి చూర్ణికను అర్థ తాత్పర్య విశేషాలతో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
   
శ్రీమత్కదంబతరు విడంబిత లస దంబురుహచర ద్వలమాన మానసౌక గరుత్పవమాన ప్లవమాన భాసమాన కంకేళీవన కేళీ సంజాత శ్రమబిందు కందళిత ముఖారవిందే! సంతతానందే!
అర్థం
శ్రీమత్= సంపద గలిగిన; ఒప్పిదము గలిగిన;కదంబతరు= కడిమి చెట్టును ; విడంబిత=అనుకరించు; లసత్ = ప్రకాశమాన మైనఅంబురుహ =నల్లటి పద్మములందు; చరత్ = విహారము చేస్తూ  ;వలమాన= అటు ఇటూ తిరుగుచున్న;మానసౌక = హంస యొక్క;గరుత్ఱెక్క;పవమాన=వాయువులో ప్లవమాన= తెప్పగా; భాసమాన = ప్రకాశించుచున్న;కంకేళీ=అశోకము
వనకేళీ = అడవిలో తిరుగుట చేత;సంజాత = పుట్టిన;శ్రమబిందు= శ్రమతో పుట్టిన చెమట బిందువులచే; కందళిత = చిగురించుచున్న, మొగ్గతొడుగుతున్న ముఖారవిందే!= ముఖ పద్మము కలదానా;  సంతతానందే!= ఎప్పుడూ ఆనందము గొలుపుదానా ! ఆనంద స్వరూపిణీ
తాత్పర్యం
          సంపద గలిగిన కలిగిన కడిమి చెట్టును అనుకరించు ప్రకాశమానమైన నల్లటి పద్మములందు  విహారము చేస్తూ  అటు ఇటూ తిరుగుచున్న  హంస యొక్క   ఱెక్కవాయువులో తెప్పగా ప్రకాశించుచున్నఅశోకములున్న  అడవిలో తిరుగుట చేత  పుట్టిన  శ్రమతో పుట్టిన చెమట బిందువులచే  చిగురించుచున్న, మొగ్గతొడుగుతున్న ముఖ పద్మము కలదానా!  ఎప్పుడూ ఆనందము గొలుపుదానా ! ఆనంద స్వరూపిణీ !  ఓ త్రిపుర సుందరీ దేవీ ! నీకు నమస్సులు
విశేషాలు
Ø  పరమాత్ముడు  కృష్ణావతారంలో స్నానం చేస్తున్నఆడవారి వస్త్రాలను  దొంగిలించి , సమీపంలోని కడిమిచెట్టు నెక్కి కూర్చున్నాడ.   సమయం లో తాను చెట్టుగా జన్మించి నందుకు  తనకు కలిగిన సంతాపాన్ని కడిమి చెట్టు పోగొట్టుకొని సంతోషాన్ని పొందిందని పోతన గారి వర్ణన. (భాగవతం. దశ. 818.)
Ø  “రాసే హరిమిహ విహిత విలాసం” అను ఒక అష్ట పదిలో జయదేవుడు విశద కదంబ తలే  మిళితం   కలి కలుష భయం  శమయంతం/మామపి  కిమపి  తరంగదనంగ దృశా  మనసా  రమయంతంఅన్నాడు.”సఖీ! కదంబ వృక్ష నీడలో చేరిన వాడు, కలి యుగ పాతకాలను పోగొట్టేవాడు, మన్మథ కామ దృష్టితో   నన్ను సంతోష పెట్టే  వవాని యొక్క   అందంగా పెదవిమీద   ప్రకాశించే  స్వామి మందహాసాన్ని    నా  మనస్సు  పొదరింటిలో  స్మరిస్తోంది అనివ్రాసాడు( నేను ఒక పత్రికలో  ఆష్ట పదికి వ్రాసిన వ్యాఖ్యానం నుండి)శ్రీ కృష్ణునికి కదంబ వృక్షమంటే అంత ప్రేమ.
Ø  కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం
నితమ్బజితభూధరాం సురనితమ్బినీసేవితామ్|
నవామ్బురుహలోచనామభినవామ్బుదశ్యామలాం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే- అను ప్రసిద్ధమైన శ్లోకం కూడా అమ్మ ని కడిమి చెట్లయందు నివసించుదానిగా మొట్టమొదటి వర్ణన చేసింది.(కడిమి చెట్ల వనములో నివసించునదీ,మునిసముదాయమను కదంబవృక్షములను ఆనందింప చేయు మేఘమాలయైనదీ, పర్వతముల కంటే ఎత్తైన నితంబము కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ,తొలకరిమబ్బు లా  నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను.)

Ø  త్రిపురాంతక స్థల పురాణాన్ని వివరించే బోర్డులో కూడా అమ్మ కదంబ వన మధ్యంలో త్రిపురాంతక పీఠేశ్వరిగా వెలసినట్లు వ్రాయబడిఉంది.
Ø  అందుకనే రంగకవి కూడా అమ్మవారి స్తోత్రాన్ని కడిమి చెట్టుతో ప్రారంభించాడు.
సర్వ సర్వంసహాఖర్వ ధూర్వహ దుర్వార  దర్వీకర గర్వ నిర్వాపణ చణ దోర్వల్లీ సమారోపిత మౌర్వీ నిర్భర నిర్ఘోష నిర్భిద్యమాన పుర్వామర గుర్విణ్యుదర దరీ కుడుంగే!
అర్థం
సర్వ= సమస్తమయిన ; సర్వంసహా=భూమి;అఖర్వ =విస్తారమైన, గొప్పదైన;ధూర్వహ = భారము వహించు;దుర్వార =వారింపనలవికాని ; దర్వీకర = ఆదిశేషుడను పాము యొక్క ; గర్వ= గర్వమును; నిర్వాపణ =వధించు (పోగొట్టి); చణ = నేర్పు కలిగిన; దోర్వల్లీ = బాహువులనెడి తీగలయందు ; సమారోపిత=అధిరోహించిన;  మౌర్వీ= అల్లెత్రాటి యొక్క; నిర్భర = భరింపశక్యముకాని; అధికమయిన; గాఢమయిన;నిర్ఘోష= ధ్వని,   నిర్భిద్యమాన= చీల్చుట; బయటఁబెట్టుట; పూర్వామర =తూర్పు,పడమరల దిక్కులనెడి ; గుర్విణ్యుదర = చూలాలి ఉదరములనెడి; దరీ = గుహలలో విలసిల్లు ; కుడుంగే= పొదరిల్లులాంటిదానా !శౌర్యానుషంగే! =పరాక్రమముయొక్క చేరిక కలదానా !
తాత్పర్యము
.సమస్తమయిన భూమి విస్తారమైన , గొప్పదైన భారము వహించు ఆదిశేషుడను పాము యొక్క  గర్వమును పోగొట్టి ,నేర్పు కలిగిన బాహువులనెడి తీగలయందు  అధిరోహించిన  అల్లెత్రాటి యొక్క అధికమయిన ధ్వని చేత  బయటఁబెట్టుట; తూర్పు,పడమరల దిక్కులనెడి  చూలాలి ఉదరములనెడి గుహలలోని పొదరిల్లుకలదానాపరాక్రమముయొక్క చేరిక కలదానా !నీకు నమస్సులు
విశేషాలు
          ఈ భూమిని తానే మోస్తున్నానని ఆది శేషునికి ఒక రకమైన గర్వముంది. నువ్వు అల్ల్లెత్రాడు అలా సంధించావో లేదో, ఆ లేదో- ఆ బ్రహ్మాండమయిన ధ్వని చేత దిక్కులన్నీ బద్దలయాయి. ఆది శేషునికి తన సామర్థ్యమేపాటిదో తెలిసి వచ్చిందని భావం
శుంభ దంభా మఖారంభ సమయ సముజ్జృంభిత దిక్కుంభి ప్రకటకట స్రవద్దానాసవ పానోదిత గానాధిక నానా మధుపానీకకులీనాంచిత వినీల పతత్రప్రభా భాసమానాసమానాలకాభిరామే! మరకతశ్యామే!
అర్థం
శుంభ= శుంభుడను రాక్షసునియొక్క  ; దంభా మఖారంభ=కపటపుయజ్ఞములో ఆరంభించిన ;  సమయ = శపథము చేత ; సముజ్జృంభిత = బాగా అతిశయించిన; దిక్కుంభి = దిక్కులనెడి ఏనుగులయొక్క ; ప్రకట=ప్రసిద్ధమయిన ;కట = చెక్కిళ్లనుండి ; స్రవత్= స్రవించు ; దాన+ఆసవ=మదమను  పక్వముచేయని చెఱకురసముతో చేసిన మద్యమును    పాన+ఉదిత = తాగుట చేత  పుట్టిన ; గాన+అధిక = గానములచేత అధికమయిన ; నానా= వివిధమైన;  మధుప+అనీక=తుమ్మెదల  సమూహము తో ; మధుకులీన+అంచిత= ఆడుతుమ్మెదల సమూహముతో ; వినీల = బాగా నల్లని ; పతత్ర = రెక్క; ప్రభా భాసమాన= బాగా ప్రకాశించే ; అసమాన= సాటిలేని ; అలకాభిరామే= అలకా+అభిరామే= ముంగురుల చేత మనోజ్ఞమైన దానా !;  మరకతశ్యామే! = ఆకుపచ్చ నీలము అనిపించే నీలము కల గలిపిన మరకతమణి శరీర కాంతికలదానా !
తాత్పర్యము
శుంభుడను రాక్షసునియొక్కకపటపుయజ్ఞములో ఆరంభించిన  శపథము చేత  బాగా అతిశయించిన  దిక్కులనెడి ఏనుగులయొక్క ప్రసిద్ధమయిన  చెక్కిళ్లనుండి  స్రవించుమదమను  పక్వముచేయని చెఱకురసముతో చేసిన మద్యమును    తాగుట చేత  పుట్టిన  గానములచేత అధికమయిన  ఉత్సాహము కలిగిన  వివిధమైన;తుమ్మెదల  నల్లని రెక్కలవలె  బాగా ప్రకాశించే  సాటిలేని  ముంగురుల చేత మనోజ్ఞమైన దానా ! ఆకుపచ్చ నీలము అనిపించే నీలము కల గలిపిన మరకతమణి శరీర కాంతికలదానా !
విశేషాలు
Ø  త్రిపురసుందరీదేవి ముంగురులు తుమ్మెద రెక్కలవలె నల్లగా ఉన్నాయని చెప్పుట కొరకు శుంభుడను వాడు చేసిన గర్వ యజ్ఞ ప్రసక్తి  తెచ్చి  భావసౌందర్యాన్ని కవి పెంచాడు. అమ్మ శుంభుని చంపి వాడి గర్వాన్ని పోగొట్టిందనే విషయంవివిధరీతులలో కవి చెప్పాడు.
Ø  హిరణ్యకశిపు వంశములో పుట్టిన సుందోపసుందుల కొడుకులు  శుంభ నిశుంభులు. వీరు పుష్కర క్షేత్రమున బ్రహ్మనుఁగూర్చి ఉగ్రతపము చేసి  ఇంద్రాదిసురలను పరిభవించు శక్తిని ఒందిరి. వీరు గౌరీకాయకోశమున ఉండి పుట్టిన కౌశికీదేవిచే చంపఁబడిరి.
Ø  మరకత శ్యామలను   దశ విద్యలలో (1. కాళి, 2. తార, 3. ఛిన్నమస్త, 4. శ్రీ, 5. భువనేశ్వరి, 6. భైరవి, 7. బగల, 8. ధ్రూమ, 9. త్రిపురసుందరి, 10. మాతంగి. ) మాతంగి అను ఒక  దేవతగా చెబుతారు. విష్ణువు కు పది అవతారములు ఉన్నట్లే పర దేవతకు కూడా పది విద్యలు, పది దేవతలు కలరు. ఒక్కో దేవతను ఒక్కో రూపములో, ఒక్కో మంత్రముతో ఆరాధిస్తారు. శ్యామల వర్ణముతో కూడి వుంటుంది. ఈమె త్రిపుర సుందరికి మంత్రిణి. ఈమెనే మరకత శ్యామల అని సంస్కృతమునందు, పచ్చైయమ్మన్ అని తమిళములోను పిలుస్తారు.
Ø  మె మతంగుని కొమార్తె అగుటచే మాతంగి అని పేరు వచ్చింది. మతంగ మహర్షి కడిమి చెట్ల మధ్య, అడవిలో ధ్యానం చేస్తుండగా దేవత సాక్షాత్కరించింది. నూరు సంవత్సరాలు మహర్షి తపస్సు చేస్తే కాళీ దేవి శ్యామలయై సాక్షాత్కరించింది. కాళీ తీవ్ర రూపమైతే, శ్యామలను  కోమల రూపంగా  చెబుతారు. . మాతంగికి మరో పేరు శ్యామల.
Ø  ఈమెను ఆరాధించే కాళిదాసు మహా కవి అయినాడు. మాతా మరకత శ్యామా మాతంగీ మధు శ్యాలినీ,
కుర్యాత్ కటాక్షం కళ్యాణీ కదంబ వన వాసినీ. అని ఆయన చెప్పిన శ్లోకం ప్రసిద్ధమయినది.
Ø  ఆమె మధుశాలిని కూడా. అందుకే శ్రీరంగ కవి కూడా అమ్మని వర్ణిస్తూ పాదాలలొ ఆసవ ప్రసక్తి తెచ్చాడు.
Ø  మధువు సుఖానికి సంకేతం గా ఒక సంస్కృత న్యాయంలో (మధు పశ్యసి దుర్బుద్ధే ప్రపాతం కిం పశ్యసి )చెప్పబడింది.
మూఢుఁడా! తేనెనే చూచుచున్నావుగాని, పతనమును మాత్రము గమనించుట లేదు. ఒకఁడు చెట్టు చివరకొమ్మలో నున్న తేనెను సంపాదింపవలయునను పేరాసతో ప్రాకుచుండెనేగాని, అచటికొమ్మ విఱిగి తాను పడుటను మాత్రము గమినించుట లేదఁట. అట్లే- తుచ్ఛకామసుఖ మనుభవించు నిచ్ఛచే చేయరాని పనులలో నడుగిడుటయేగాని మూఢులు దానివలన సంభవించు నరకమును మాత్రము గుర్తించరు. దీనినే "మధు పశ్యసి దుర్బుద్ధే ప్రపాతం కిం పశ్యసి" అనియు నందురు.
రంగదభంగ రణరంగ కళాభిషంగ చండముండాసురప్రకాండ ఖండ నోద్దం డాఖండల వేదండ తుండాయమాన భుజాదండ మండిత మండలాగ్ర రోచిః ప్రకీర్ణ బ్రహ్మాండ కరండే! చాముండే!
అర్థం
రంగత్= ప్రకాశించే; అభంగ =భంగము లేని;  రణరంగ= యుధ్ధరంగ ;  కళ+అభిషంగ = కళను చేరిన ; చండముండాసురప్రకాండ = చండముండులను;అసుర= రాక్షసులను ;ప్రకాండ= చెట్టు బోదెలను( శ్రేష్ఠుడు);  ఖండన= ఖండించుట యందు;ఉద్దండ= అఖండల= ఇంద్రునియొక్క ;  వేదండ= ఐరావతమును తుండాయమాన =తొండమును లాగి సాగదీయుటలో ;  భుజాదండ = భుజదండముతో; మండిత=అలంకరింపబడిన మండలాగ్ర = కత్తి యొక్క ; రోచిః = వెలుగులో ;ప్రకీర్ణ = వ్యాపించిన ; బ్రహ్మాండ= బ్రహ్మాండమను ;  కరండే  =భరణి కలదానా  ! చాముండే=  చాముండాదేవీ !
            తాత్పర్యము
          చాముండాదేవీ ! యుధ్ధరంగ కళలో ఆరి తేరిన  శుంభనిశుంభుల సేవకులయిన చండముండులను రాక్షసుల చెట్టు బోదెలను నువ్వు  ఖండించే సమయములో  ఇంద్రునియొక్క  ఐరావతము ఉత్సాహంతో తొండమును లాగి సాగదీసింది.నీ   భుజదండమును  అలంకరించిన నీ   కత్తి యొక్క  వెలుగులో  ఈ బ్రహ్మామ్డమంతా వ్యాపించి ఒక  భరణి అయినది.

యుగవిగమావసర సముద్భూత ప్రవాత సంఘాత జీమూత మధ్య ధగద్ధగాయమాన సౌదామినీ ద్యుతి వినిర్మితి కోమల సంహనన విశేషే! అపహృత దోషే!
అర్థం
యుగ= యుగ ; విగమ+అవసర= నాశన సమయములో సముద్భూత= పుట్టిన;  ప్రవాత = ప్రచండ మారుత ; సంఘాత= గట్టి దెబ్బ, సమూహము ;జీమూత మధ్య = మబ్బుల  మధ్య;  ధగద్ధగాయమాన= ధగద్ధగాయమానముగావెలుగు ;  సౌదామినీ= మెరుపుల ;  ద్యుతి= కాంతితో;  వినిర్మితి= చక్కగా నిర్మింపబడిన;  కోమల సంహనన విశేషే! = కోమలమైన శరీర విశేషము కలదానా ! అపహృత దోషే! = పోగొట్టబడిన దోషములు కలదానా !
తాత్పర్యము
యుగాంతములో వచ్చే ప్రళయ సమయములో  ప్రచండ మారుతముల తాకిడి చేత  మబ్బుల  మధ్య ధగద్ధగాయమానముగా వెలుగు మెరుపుల కాంతితో  చక్కగా నిర్మింపబడిన  కోమలమైన శరీర విశేషము కలదానా ! పోగొట్టబడిన దోషములు కలదానా !
విశేషము
 రంగ కవి గారి ఈ భావన చాలా కొత్తగా ఉంది.ప్రళయ కాలములోని మెరుపుల కాంతి అనూహ్యం. అటువంటి మెరుపుల కాంతితో  త్రిపుర సుందరీదేవి శరీరము నిర్మింపబడిందట. మళ్లీ ఆ శరీరము కోమలమయినదట. జయహో
అసమసమయ వికసిత కుసుమ కిసలయ మసృణ ఘుసృణ విసరణ చరణాలంకరణ నిపుణ నూపుర కుహురావ లయ యుత కలకంఠ కంఠ కలరవానుకూల పంచమస్వర గ్రామానుకరణ విపంచికా వల్లరీ నినాదామోదిత సకల దిశావకాశే! సుప్రకాశే!
అర్థం
అసమ= సమయము కాని; సమయ = సమయములో ; (శ్రీ విద్యలోని సమయాచారము కూడా ఇక్కడ సూచ్యం. అమ్మ సమయాచార తత్పరా కదా !)వికసిత= వికసించిన;  కుసుమ= పువ్వు యొక్క ;  కిసలయ = చిగురు ; మసృణ = చిక్కని, నున్నని; ఘుసృణ = కుంకుమపువ్వు; విసరణ= వ్యాపించిన;  చరణాలంకరణ= పాదములను అలంకరించిన ;  నిపుణ= నేర్పు కలిగిన ;  నూపుర= అందె;  కుహురావ= కోకిల ధ్వనుల ;  లయ యుత=లయతో కూడిన;  కలకంఠ = కోకిలల; కంఠ కలరవానుకూల=పావురముల ధ్వనులకు అనుకూలముగా పంచమస్వర = పంచమస్వరమునును;గ్రామానుకరణ= షడ్జాదిస్వరమును అనుకరించు విపంచికా= వీణ;  వల్లరీ= తీగ; నినాదామోదిత= నినాదమును ఆమోదించిన;  సకల దిశావకాశే! = అన్ని దిశల వకాశము కలదానా ! సుప్రకాశే!= చక్కటి ప్రకాశము కలదానా !
తాత్పర్యం
అసమ= సమయము కాని; సమయ = సమయములో ; (శ్రీ విద్యలోని సమయాచారము కూడా ఇక్కడ సూచ్యం. అమ్మ సమయాచార తత్పరా కదా !)వికసిత= వికసించిన;  కుసుమ= పువ్వు యొక్క ;  కిసలయ = చిగురు ; మసృణ = చిక్కని, నున్నని; ఘుసృణ = కుంకుమపువ్వు; విసరణ= వ్యాపించిన;  చరణాలంకరణ= పాదములను అలంకరించిన ;  నిపుణ= నేర్పు కలిగిన ;  నూపుర= అందె;  కుహురావ= కోకిల ధ్వనుల ;  లయ యుత=లయతో కూడిన;  కలకంఠ = కోకిలల; కంఠ కలరవానుకూల=పావురముల ధ్వనులకు అనుకూలముగా పంచమస్వర = పంచమస్వరమునును;గ్రామానుకరణ= షడ్జాదిస్వరమును అనుకరించు విపంచికా= వీణ;  వల్లరీ= తీగ; నినాదామోదిత= నినాదమును ఆమోదించిన;  సకల దిశావకాశే! = అన్ని దిశల వకాశము కలదానా ! సుప్రకాశే!= చక్కటి ప్రకాశము కలదానా !



 తారాకర తారాధిప తారాద్రి సమీరాశన క్షీరాబ్ధి పటీరాంబుజ హీరాబ్జ సుధాధారా నిభ గౌరద్యుతి విద్యోతమాన యశోవిశాలే! శ్రీబాలే!
తారాకర =నక్షత్రముల సమూహము; తారాధిప = చంద్రుడు; తారాద్రి సమీరాశన క్షీరాబ్ధి=పాలసముద్రము పటీర+అంబుజ = చందనము, పద్మము ; హీర=వజ్రము, అబ్జ= పద్మము;  సుధా= అమృతము, ధారా= కత్తి అంచుతో;  నిభ=సమానమైన గౌరద్యుతి = తెల్లని కాంతితో ; విద్యోతమాన= ప్రకాశించుచున్న యశోవిశాలే!= విస్తారమైన కీర్తి కలదానా !  శ్రీబాలే!= శ్రీ బాలాంబికా ! నమస్కారము.
చిదగ్ని కుండికార్ణవ సంజాత భువనమోహినీ గేహినీ సమస్త కుళ కౌళీ నిగర్భ రహస్యాతి రహస్య పరాపర రహస్య యోగినీ శ్రీమ త్కౌమార గిరీంద్ర సౌవర్ణ ప్రాకార మధ్య విటంక విన్యస్త నిస్తుల ప్రశస్త మణిగణ వ్యాకీర్ణ మండపాభ్యంతర వితర్దికారంగ వలభికాయంత్ర పాంచాలికాయమాన ప్రమథగణ సేవిత శ్రీ త్రిపురాంతకేశ్వరోత్సంగ నివాసే! విశదహాసే!


చిదగ్నికుండికార్ణవ సంజాత= బ్రహ్మ తేజస్సుకు ఒక ఆకారమైన చిత్ అను అగ్నికుండం నుండి పుట్టిన (చిత్’’ అంటే జ్ఞానంప్రతిపదార్ధం వెనుక పదార్ధానికి సంబంధించిన తత్త్వాన్ని  జ్ఞానమంటారు. తత్త్వం          లేకుండా                 పదార్ధం వుండదు. వృక్షం లోని  వృక్షత్వమే దానియొక్క జ్ఞానము. ఇదే  చిత్ అని      పిలువబడుతుంది.)
             భువనమోహినీ = భువనములను మోహింపచేయు; గేహినీ= ఇల్లాలు; సమస్త = సమస్తమైనకులమార్గమును అనుసరించే వారు, , కౌలమును అనుసరించే వారిని (కులమంటే వ్యష్టి కుండలినిని సమిష్టిచైతన్యం అయిన పరమశివునితో అనుసంధానించే మార్గం.దీనినే 'కౌలమార్గం' అని కూడా అంటుంటారు కౌలముఅంటే  భోగము , యోగము కలిపి ఆచరించే మార్గం)  నిగర్భ రహస్యాతి రహస్య పరాపర            రహస్య యోగినీ=అనేక రహస్యములు కలిగిన యోగినులు కలది;   శ్రీమత్కౌమార= శోభావంతమైన  కౌమారగిరి  పర్వత శ్రేష్ఠము యొక్కసౌవర్ణ ప్రాకార మధ్య = బంగారు ప్రాకారముల మధ్య ఉన్న విటంక= ఇంటి ముంజూరునందలి గువ్వగూడులో ;  విన్యస్త = ఉంచబడిన
నిస్తుల= సాటిలేని;  ప్రశస్త= ప్రశస్తమైన;  మణిగణ= మణి సమూహములతో  వ్యాకీర్ణ = చెదిరిన; మండపాభ్యంతర= మండపములోపలి ;  వితర్దికా= అరుగు ; రంగ = నాట్య స్థానములోని ; వలభికాయంత్ర = చంద్రశాల యంత్రములతో ;             పాంచాలికాయమాన= బొమ్మలుగ చేయబడిన ప్రమథగణ సేవిత= ప్రమథ గణములచే  సేవింపబడు;  శ్రీ త్రిపురాంతకేశ్వర= త్రిపురాంతకుడైన పరమశివుని యొక్కఉత్సంగ నివాసే= తొడపై  నివాసము కలదానా !      విశదహాసే! = స్పష్టమయిన నవ్వు కలదానా !
సకల సుకవి వర్ణిత మృదుమధుర కవితా రచనాధురీణ భారతులాన్వయాంభోధి తుహినకర రంగయాభిధా నాంగ నాదెమాంబికా గర్భశుక్తి మౌక్తికాయమాన శ్రీరంగకవి విరచిత గద్యపద్యానుమోద మానసాంభోజే! నత సురసమాజే!
 శ్రీ త్రిపురాంబికాభిధే యావతీర్ణ జగదంబే! అధరజితబింబే! పులిన నితంబే!

శ్రీశ్రీ త్రిపురాంబే! సదామాం పాహి, మాం పాహి.
సకల సుకవి వర్ణిత= సమస్త సుకవులచే వర్ణించబడిన;  మృదుమధుర కవితా రచనాధురీణ= మృదుమధురమైన  కవితా రచన చేయుటలో  నేర్పరి యయిన; భారతులాన్వయాంభోధి = భారతుల వంశమనెడి సముద్రమునకు; తుహినకర = చంద్రునివంటి వాడయిన ; రంగయాభిధాన = రంగయ అను పేరు కలిగిన వాని అంగన= స్త్రీ అయిన (భార్య ఆయిన) ఆదెమాంబికా= ఆదెమ అను తల్లియొక్క  గర్భ శుక్తి మౌక్తికాయమాన =గర్భమనెడి ముత్యపు చిప్పలో ముత్యములా ప్రభవించిన ;  శ్రీరంగకవి విరచిత= శ్రీ రంగ కవి అను నేను రచించిన   గద్యపద్యఅనుమోద= గద్య పద్యలచే సంతోషింపబడిన;  మానసాంభోజే!= మనస్సను పద్మము కలదానా !  నత సురసమాజే!= నమస్కరించిన దేవతా సమూహము కలదానా !
           
 శ్రీ త్రిపురాంబికాభిధేశ్రీ త్రిపురాంబిక అను పేరు కలదానా !   శ్రీ యావతీర్ణ జగదంబే! =సమస్త ప్రఅపంచానికీ జననీ ! అధరజితబింబే= పెదవుల చేత జయింపబడిన దొండపండు కలదానా !  పులిన నితంబే= ఇసుకదిబ్బలవమ్టి నితంబములు కలదానా !
 శ్రీశ్రీ త్రిపురాంబే! =  శ్రె త్రిపురాంబికా దేవీ ! సదా= ఎప్పుడూ ; మాం= నన్ను  పాహి= రక్షించు, మాం పాహి.= నన్ను రక్షించు

           
త్రిపురసున్దర్యష్టకమ్

కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం
నితమ్బజితభూధరాం సురనితమ్బినీసేవితామ్|
నవామ్బురుహలొచనామభినవామ్బుదశ్యామలాం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||||

    కదంబవృక్షములు (కడిమి చేట్లు) వనమందు నివసించునదీ,మునిసముదాయమను కదంబవృక్షములను వికసింపచేయు (ఆనందింప చేయు) మేఘమాలయైనదీ, పర్వతముల కంటే ఏత్తైన నితంబము కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ,తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను.

కదమ్బవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్|
దయావిభవకారిణీం విశదరొచనాచారిణీం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||||

    కదంబవనమందు నివసించునదీ, బంగారు వీణను ధరించినదీ, అమూల్యమైన మణిహారముల నలంకరించుకున్నదీ, ముఖము నందు వారుణీ (ఉత్తమమైన మద్యము) పరిమళము కలదీ,అత్యధికమైన దయను కురిపించునదీ, గొరొచనము పూసుకున్నదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సున్దరిని ఆశ్రయించుచున్నాను.

కదమ్బవనశాలయా కుచభరొల్లసన్మాలయా
కుచొపమితశైలయా గురుకృపాలసద్వేలయా|
మదారుణకపొలయా మధురగీతవాచాలయా
కయాపి ఘనలీలయా కవచితా వయం లేఏలయా||||

    కదంబవనములొనున్న ఇంటిలొ నివసించునదీ, వక్షొజములపై పుష్పమాలనలంకరించుకున్నదీ, పర్వతములవలే ఏత్తైన స్తనములు కలదీ, అధికమైన కృపాసముద్రమునకు తీరము వంటిదీ, మద్యముచే ఏర్రనైన చేంపలు కలదీ, మధుర సంగీతమును గానము చేయు చున్నదీ, వర్ణించనలవి కానిదీ, మేఘము వలే నల్లనైనదీ అగు ఒక లీలచే మనము రక్షించబడుచున్నాము.

కదమ్బవనమధ్యగాం కనకమణ్డలొపస్థితాం
షడమ్బురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్|
విడమ్బితజపారుచిం వికచచన్ద్రచూడామణిం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||||

    కదంబవన మధ్యమునందున్నదీ, బంగారు మండపము నందు కొలువు తీర్చునదీ మూలాధారము-స్వాదిష్ఠానము-మణిపూరము-అనాహతము-విశుద్దము-ఆజ్ఞ అనే ఆరుచక్రములందు నివసించు నదీ, ఏల్లప్పుడు యొగసిద్దులకు మేరుపు తీగవలే దర్శనమిచ్చునదీ, జపాపుష్పము (మంకేన పువ్వు) వంటి శరీర కాంతి కలదీ, శిరస్సుపై చంద్రుని ఆభరణముగా ధరించునదీ, మూడు కన్నులు గల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసున్దరిని ఆశ్రయించుచున్నాను.

కుచాఞ్చితవిపఞ్చికాం కుటిలకున్తలాలఙ్కృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్|
మదారుణవిలొచనాం మనసిజారిసమ్మొహినీం
మతఙ్గమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే||||

    వక్షస్థలము నందు వీణ కలదీ, వంకరయైన కేశములతొ అలంకరింపబడినదీ, సహస్రార పద్మము నందు నివసించునదీ, దుష్టులను ద్వేషించునదీ, మద్యపానముచే ఏర్రనైనకన్నులు కలదీ, మన్మథుని జయించిన శివుని కూడ మొహింపచేయునదీ, మతంగమహర్షికి కుమార్తేగా అవతరించినదీ, మధురముగా మాట్లాడునదీ అగు త్రిపురసున్దరిని ఆశ్రయించుచున్నాను.


స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరమిన్దునీలామ్బరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాఞ్చలామ్|
ఘనస్తనభరొన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||||

    ప్రథమరజస్వలయై ఆరక్తబిందువు లంటియున్న నల్లని వస్త్రమును ధరించినదీ, మద్యపాత్రను పట్టుకున్నదీ, మద్యపానముచే ఏర్రనై కదలుచున్న కన్నులు కలదీ, ఉన్నతమైన స్తనములు కలదీ, జారుచున్న జడముడి కలదీ, శ్యామల (నల్లనిది) యైనదీ, మూడు కన్నులు గల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసున్దరిని ఆశ్రయించుచున్నాను.

సకుఙ్కుమవిలేపనామలికచుమ్బికస్తూరికాం
సమన్దహసితేక్షణాం సశరచాపపాశాఙ్కుశామ్|
అశేషజనమొహినీమరుణమాల్యభూషామ్బరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యమ్బికామ్||||

    కుంకుమతొ కలిసిన విలేపమును పూసుకున్నదీ, ముంగురులను తాకుచున్న కస్తూరీ తిలకమును ధరించినదీ,చిరునవ్వుతొ కలిసిన కన్నులు కలదీ, పుష్పభాణమును-చేరకువింటినీ-పాశాంకుశములను ధరించినదీ, అశేష జనులను మొహింపచేయునదీ, ఏర్రని పూలదండలను-ఆభరణములను-వస్త్రములను ధరించినదీ, జపాపుష్పము వలేప్రకాశించుచున్నదీ అగు జగదంబను జపము చేయునపుడు స్మరించేదను.

పురందరపురంధ్రికాచికురబన్ధసైరంధ్రికాం
పితామహపతివ్రతాపటుపటీరచర్చారతామ్|
ముకున్దరమణీమణీలసదలఙ్క్రియాకారిణీం
భజామి భువనామ్బికాం సురవధూటికాచేటికామ్||||

    ఇంద్రుని భార్యయగు శచీ దేవిచే కేశాలంకరణ చేయబడినదీ, బ్రహ్మదేవుని భార్యయగు సరస్వతిచే మంచి గంధము పూయబడినదీ, విష్ణుపత్నియగు లక్ష్మీచే అలంకరింపబడినదీ, దేవతాస్త్రీలు చేలికత్తేలుగా కలదీ యగు జగన్మాతను సేవించుచున్నాను.



                            జయ జయ శంకర హర హర శంకర

                            జయ జయ శంకర హర హర శంకర